ఏపీ విద్యార్థుల పాలిట జగన్ కంసుడు అని తేలిపోయింది: లోకేశ్

  • ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ
  • తీవ్రంగా స్పందించిన లోకేశ్
  • కరోనా ఉద్ధృతంగా ఉందని వెల్లడి
  • అనేక రాష్ట్రాలు పరీక్షలు నిలిపేశాయని వివరణ
  • ఏపీలో మాత్రం పరీక్షలు పెడుతున్నారని ఆగ్రహం
  • జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం అని వ్యాఖ్యలు
ఏపీలో కరోనా మహమ్మారి ఉద్ధృతంగా ఉన్నప్పటికీ పరీక్షలు నిర్వహించడం తగదని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ ప్రభుత్వానికి హితవు పలికారు. ఏపీలో విద్యార్థుల పాలిట జగన్ కంసుడు అని తేలిపోయిందని విమర్శించారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రస్థాయిలో ఉన్న దశలో కేంద్రంతో పాటు దాదాపు అన్ని రాష్ట్రాలు పరీక్షలు రద్దు చేయడమో, వాయిదా వేయడమో చేశాయని వెల్లడించారు. కానీ ఒక్క ఏపీలోనే పరీక్షలు నిర్వహిస్తామని మొండిగా ముందుకువెళ్లడం జగన్ మూర్ఖత్వానికి నిదర్శనం అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

విద్యార్థుల భవిష్యత్తు అంటూ దీర్ఘాలు తీస్తున్న జగన్ అధ్వానపు పాలనలో బతికుంటే కదా భవిష్యత్తు అని వ్యంగ్యం ప్రదర్శించారు. అంబులెన్స్ లు రాక, ఆక్సిజన్ లేక జనం పిట్టల్లా రాలిపోతున్నారని వెల్లడించారు. కరోనా మృతులతో మార్చురీలు నిండిపోతున్నాయని, అంత్యక్రియలకు శ్మశానాల వద్ద క్యూలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఆసుపత్రిలో బెడ్డు దొరక్క రోడ్డుపైనే కుప్పకూలిపోతున్నారని వివరించారు. ఇవన్నీ పట్టించుకోకుండా పరీక్షల పేరుతో 15 లక్షల మందికిపైగా విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడడం ఫ్యాక్షన్ సీఎంకు తగదని లోకేశ్ హితవు పలికారు.

Nara Lokesh
Jagan
Exams
Tenth
Inter
Corona Virus
Andhra Pradesh

More Telugu News